రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే


చిత్రం-మాతృదేవోభవ (1993),రచన-వేటూరి ,సంగీతం,గానం–కీరవాణి,
******
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మాచిలకా పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే
చెదిరింది నీ గూడు గాలిగా
చిలకా గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతీయవే రాలిపొయే
అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై నీ జతకే వెన్నియవై రాలిపోయే
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=Ox2l0gkwU7k వినండి!
***
వేటూరి సుందరరామ్మూర్తి

వేటూరిగా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 – మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద, శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాశారు.
వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు.. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం… ఇలా ఎన్నో సినిమాలు…ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన, నాదవినోదము….ఇలా ఎన్నో !
(సేకరణ)
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.