సీఎం దత్తత గ్రామాలా.. మజాకా!
ఆ గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పనులు జెట్ స్వీడులో జరిగిపోతున్నాయి. డ్రైనేజీ దగ్గరి నుంచి వ్యవసాయం వరకు అక్కడి ప్రజలకు ఇట్టే సమకూరుతున్నాయి. అంతగా అభివృద్ధి జరిగే గ్రామాలు ఏవనేగా మీ అనుమానం. వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్బెడ్రూం ఇండ్లలోకి గృహప్రవేశం చేయాలన్న సీఎం ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. రెండు గ్రామాల్లోని 550 ఇండ్లలో 350 పూర్తయ్యాయి. డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, ఎల్ఈడీ వీధిలైట్ల బిగింపు, మిషన్ భగీరథ పనులు పూర్తి కావొస్తున్నాయి. బిందుసేద్యం కోసం పైపుల బిగిం పు, ఏడు సంపుహౌజ్లు, 14 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది. 70 బోర్లతోపాటు, చేబర్తి చెరువు, చెక్డ్యాముల్లోకి వచ్చే నీటిని చెరువుల్లోకి పంపింగ్ చేసే ఏర్పాట్లుచేశారు. సాగునీటి కొరతను అధిగమించేందుకు నిర్మిస్తున్న పాండురంగసాగర్, నాలుగు కుంటల మరమ్మతులు కొనసాగుతున్నాయి. నర్సన్నపేట శివారు కూడవెల్లి వాగుపై ఐదు చెక్డ్యాముల్లో రెండింటి పనులు పూర్తవుతున్నాయి. వీటితో 190 ఎసీటీఎఫ్ నీళ్లు నిల్వ ఉండనున్నాయి.
సంప్హౌజ్ ఆపరేటర్ కోసం గదిని నిర్మిస్తున్నారు. ఇందులో ఎరువులను నిల్వచేయనున్నారు. ఎర్రవల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.ఐదు కోట్లు డిపాజిట్ చేశారు.మొక్కజొన్నకు ఎకరాకు రూ.15 వేలు,సోయాబీన్కు ఎకరాకు రూ. 12వేల చొప్పున పంటరుణాలు ఇస్తున్నారు. రెండుగ్రామాల్లో 2800 ఎకరాల్లో సమీకృత బిందు సేద్యంలో భాగంగా రెండువేల ఎకరాల్లో మొక్కజొన్న, 800 ఎకరాల్లో సోయాబీన్ సాగుచేయనున్నారు. 42 మంది నిరుపేదలకు ట్రాక్టర్లు పంపిణీ చేయగా భూమి చదును చేశారు. గురువారం నుంచి విత్తనాలు నాటుతున్నారు. ఎర్రవల్లిలో 1000 మంది కూర్చునేలా, చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకునేలా ఫంక్షన్హాల్ నిర్మాణం పూర్తవుతున్నది. ఆగస్టులో ఇంటింటికి రెండు బర్రెలు, 10 కోళ్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.