కోదండరాం ఫోన్ ట్యాప్ అవుతోందట
గత కొంతకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కోదండరాం ఏం మాట్లాడినా తెలంగాణ మంత్రులు ఒంటికాలిపై లేస్తున్నారు. అయితే తాను ఏం మాట్లాడినా ఆధారంతోనే మాట్లాడతానని చెబుతుండడంతో అది తెలంగాణ సర్కార్ జీర్ణించుకోలేక పోతోంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీ సర్కార్పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న పక్కా సమాచారం తనకు ఉందని.. ఇలా చేయటమంటే తన వ్యక్తిగత.. రాజకీయ స్వేచ్ఛను హరించటంగా ఆయన అభివర్ణించారు. ‘‘నా ఫోన్ ట్యాప్ అవుతోందన్న విషయంపై సరైన సాక్ష్యం లేని కారణంగానే కొంతకాలంగా మౌనంగా ఉన్నా. ఈ విషయంపై ఇటీవల మీడియాలో వార్తలు రావటంతో చెబుతున్నా. నా ఫోన్ ట్యాప్ అవుతోందన్న విషయంపై నాకు పూర్తి సమాచారం ఉంది’’ అని చెప్పారు.
ఇలాంటి చర్యలు ఏ మాత్రం మంచిది కాదని.. సత్సాంప్రదాయానికి మచ్చ తెస్తాయన్న ఆందోళన వ్యక్తం చేసిన కోదండరాం.. తాను ప్రజల తరఫున పని చేస్తున్నందున ప్రమాదం లేదనే ఫిర్యాదు చేయాలని అనుకోవటం లేదని చెప్పారు. నేరగాళ్ల విషయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగానే చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. కోదండరాం ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కోదండరాం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ ను ఎంతోకొంత ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడిపై తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ కు పాల్పడుతుందన్న సమాచారం ప్రభుత్వ పరపతిని ఎంతోకొంత దెబ్బ తీస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.