ఫ్లై ఓవర్ కూలిన ప్రాంతంలో పర్యటించిన రాహుల్..
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోల్కతాలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన ఫ్లై ఓవర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 27కు పైగా ఉందని సమాచారం. పశ్చిమబెంగాల్లో ఫ్లైఓవర్ కూలిన ఘటన కారణంగా చాలా కుటుంబాల్లో విషాదం నెలకొంది. బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ కోల్కతా వచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన హెలికాఫ్టర్ లో సిటీకి చేరుకున్నారు. తొలుతగా ఆయన ఫ్లైఓవర్ కూలిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.
రాహుల్ అక్కడ సహాయకచర్యల్లో పాల్గొన్న సిబ్బందిని కలిసి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోల్కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు అండగా నిలబడేందుకు వచ్చానని తెలిపారు. అంతేతప్ప రాజకీయం చేయడం కోసం కాదన్నారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
మరోవైపు కూలిన ఫ్లైఓవర్ దగ్గర శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన అదనపు బలగాలను కూడా సహాయక చర్యల కోసం రప్పించారు. భారీ యంత్రాలు, గ్యాస్కట్టర్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. కూలిన వంతెన కింద సజీవంగా ఉన్నవారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.