వారిపై వేటు తప్పదా?
ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారా? వారిపై అనర్హత వేటు తప్పదా? మేధావులు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. వివరాల్లోకి వెళ్లితే…తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లో చేరడంతో – పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా తాము స్పీకర్ వద్ద పిటీషన్లు దాఖలు చేసినా చర్య తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ ను ఆదేశించాలంటూ కాంగ్రెస్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు నోటీసు నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనా చారి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి – న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి – అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజా సదారాంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
మూడు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించినందున హాజరై అంశం పిటీషన్లు స్పీకర్ పరిశీలనలో ఉన్నట్లు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు. అనర్హత పిటీషన్లపై ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో ఎక్కడా పేర్కొనలేదన్న విషయాన్ని ఏజీ న్యాయస్థానానికి విన్నవించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సుప్రీం దీనిపై ఎలా స్పందిస్తుందన్నదాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం అంటూ నిబంధనల్లో నిర్దేశించి లేదన్న వాదన సుప్రీంలో నిలబడితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు – స్పీకర్ కూడా సేఫ్ జోన్ లో ఉంటారు. లేదంటే మాత్రం స్పీకరు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.