దీక్ష విరమించిన ముద్రగడ
కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు దీక్ష విరమించాడు. ఉదయం నుంచి హైడ్రామా కొనసాగినా చివరకు నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. తుని సంఘటన నేపథ్యంలో సర్కార్ పలువురిని నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేయడంతో ముద్రగడ దంపతులు సర్కార్ తీరుకు నిరసనగా 13 రోజులుగా రాజమహేందవ్రరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం అరెస్ట్ చేసిన అందరినీ విడిచిపెట్టడంతో ముద్రగడ దంపతులు దీక్ష విరమించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కాపు సంఘాల ఐకాస నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, తోట రాజీవ్ తదితరులు ముద్రగడ దంపతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రాజమహేందవ్రరం ఆసుపత్రి నుంచి ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ కాపు సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తానని తెలిపారు.
ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, పోలీసులు తన కుమారుడిని కొట్టడంతోపాటు భార్య, కోడలిపై దుర్భాషలాడారని, అయినా వారిపై ఎలాంటి కోపం లేదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కాపులను బీసీల్లో చేరుస్తామని మాట ఇచ్చిదని, ఆ మాటను నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. అలా మాట నిలబెట్టుకోని పక్షంలో కాపు నాయకులతో అందరితో కలిసి దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో సర్కార్ కు ముద్రగడ నుంచి మరోసారి ముప్పు ఉందని స్పష్టమవుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.