అమెరికా, కెనడా దేశాల్లో ఉంటున్న తెలుగువారి అభ్యున్నతికి కృషి చేస్తూ, వారి సంక్షేమానికి పాటుపడుతూనే మరోవైపు మాతృదేశంలో ఉన్న ఆంధ్ర ప్రజల అభ్యున్నతికి సహాయాన్ని అందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఇప్పుడు అట్లాంటాలో నిర్వహించే నాటా కాన్ఫరెన్స్ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది.
ఈ నేపథ్యంలో అట్లాంటాలో నాటా బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాటా ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, నాటా అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, డాక్టర్ మోహన్ మల్లం, డాక్టర్ ధర్మారెడ్డి గుమ్మడి, నాటా వైస్ ప్రెసిడెంట్ డా. హరనాథ్ పొలిచెర్ల, నాటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు, నాటా రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్, రీజినల్ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అట్లాంటాలో 2014 జూలై 3,4,5 తేదీలలో జరిగే అట్లాంటా కాన్ఫరెన్స్ నిర్వహణకోసం నియమించిన కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశానికి వచ్చారు. నాటా నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ కార్యక్రమాలపై, ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ నెలలో నిర్వహించే నాటా సేవాదినాలపై ఈ సమావేశంలో సమీక్షించారు.
నాటా ప్రెసిడెంట్ డా. సంజీవరెడ్డి మాట్లాడుతూ, నాటా కాన్ఫరెన్స్కోసం 650 వేల డాలర్లను ఫండ్రైజింగ్ కార్యక్రమాల ద్వారా వసూలు చేసినట్లు చెప్పారు. నాటా ప్రముఖులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి 100 వేల డాలర్లు, డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి 100 వేల డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. తెలుగు కమ్యూనిటీకి నాటా చేస్తున్న కార్యక్రమాల వివరాలను సంజీవరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. కాన్ఫరెన్స్ను అందరికీ నచ్చేలా కార్యక్రమాలను రూపొందించడానికి ఒక ప్రణాళికను తయారు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 29వరకు నాటా సేవా దినాల పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు.
డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలతో నాటా తెలుగు కమ్యూనిటీకి దగ్గరైందని చెప్పారు. నాటాలో 10వేల మందిని చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఇప్పటికే ఆ దిశగా అన్నీ నగరాల్లో నాటా కార్యక్రమాలను నిర్వహించి వేలాదిమందిని నాటా సభ్యులుగా చేర్పించామన్నారు. నాటా కార్యవర్గ సభ్యులు కూడా తమ తమ ప్రాంతాల్లో సభ్యత్వనమోదును వేగవంతం చేయాలని కోరారు.
డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ, నాటా ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అందరి అభిమానాలను చూరగొన్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే సేవా కార్యక్రమాల్లో నాటా సభ్యులంతా ముమ్మరంగా పాల్గొనాలని ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో తమతమ ప్రాంతాల్లో నాటా ద్వారా ఆరోగ్య శిబిరాలను ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అట్లాంటా కాన్ఫరెన్స్ కన్వీనర్ బాల ఇందుర్తి, ఆంధ్రప్రదేశ్ సేవా దినాల కన్వీనర్ డా. మోహన్ తలమటి, డా. ద్వారకనాథ్ రెడ్డి తదితరులు కూడా మాట్లాడారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.