ఆ డబ్బు ఎవరిదో తెలిసిపోయింది!
మూడు కంటెయినర్లలో వందల కోట్లు డబ్బు తమిళనాడులో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఆ డబ్బు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్లదేనని అనుమానాలు ఉన్నాయి. ఏపీ ప్రతిపక్షాలు అయితే ఆ డబ్బు మొత్తం చంద్రబాబుదేనని విమర్శలు కూడా చేశారు. బాబు దొరికిపోయినట్లేనని సంబర పడ్డాయి. కాగా ఆ మూడు కంటెయినర్లలోని రూ.570 కోట్లు డబ్బు తమదే అని విశాఖపట్నం ఎస్ బిఐ అధికారులు తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. నగదు కావాలని ఈ నెల 11న రిజర్వ్ బ్యాంక్ ను కోరామని, కోయంబత్తూరులో అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. విమానంలో డబ్బు తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయని, దీంతో ఎస్కార్టుతో రోడ్డు మార్గంలో నగదు తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు.
డబ్బును తరలించేందుకు విశాఖపట్నం నుంచే ఎస్కార్టును పంపించామని ఎస్బీఐ అధికారులు వివరించారు. తమిళనాడు పోలీసులకు డబ్బుకు సంబంధించిన ఆధారాలిచ్చామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఏదైమైనా అంత డబ్బు ఒక్కసారిగా పట్టుపట్టడం.. అందులోనూ తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం కలకలం రేపింది. మొత్తానికి ఆ డబ్బు తమదేనని, అన్ని ఆధారాలు ఉన్నాయని బ్యాంక్ అధికారులు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమైంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.