మోడీ జట్టులో మార్పులు.. చేర్పులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ దాదాపు రెండేళ్ల తర్వాత చేపట్టిన రెండో మంత్రి వర్గ విస్తరణలో కొన్ని కూడికలు.. మరికొన్ని తీసివేతలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో త్వరలో జరుగున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. దళితులు, వెనుకబడిన వర్గాల వారిలో పార్టీని బలోపేతం చేసుకోవటం లక్ష్యంగా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ఈ విస్తరణ చేపట్టినట్లు స్పష్టమవుతోంది. కాగా ఇప్పటివరకు స్వతంత్ర సహాయమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక్కరికే పదోన్నతినిస్తూ కేబినెట్ హోదా కల్పించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శాఖలు మినహా మిగిలిన మంత్రుల్లో చాలా మందికి శాఖలు మారాయి.
మార్పులు.. చేర్పులు ఇవే…
* మానవవనరుల అభివృద్ధిశాఖను స్మృతి ఇరానీ నుంచి తొలగించారు. ఆ శాఖను ప్రకాశ్జావదేకర్కు తాజాగా కేబినెట్ హోదా కల్పిస్తూ ఆయనకు అప్పగించారు. స్మృతిఇరానీని అంతగా ప్రాధాన్యం లేని జౌళిశాఖకు మార్చారు.
* ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వద్ద అదనంగా ఉన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఎం.వెంకయ్యనాయుడికి కేటాయించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా జైట్లీ వద్దే ఉంది. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్నారు. తాజా మార్పుల్లో ఆయన నుంచి పార్లమెంటరీ వ్యవహారాలను తప్పించి సమాచార ప్రసారశాఖను కేటాయించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అనంత్కుమార్కు అదనంగా కేటాయించారు. అనంత్ ప్రస్తుతం రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
* న్యాయశాఖను సదానందగౌడ నుంచి తప్పించి.. సమాచార సాంకేతికత(ఐటీ) శాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్కు అప్పగించటం కీలక మార్పు. సదానందకు గణాంకాలు, పథకాల అమలు శాఖను కేటాయించారు.
* చౌదరి బీరేంద్రసింగ్కు ఉక్కు శాఖను కేటాయించి.. ఆయన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్ శాఖలను నరేంద్రసింగ్ తోమర్కు కేటాయించారు. తోమర్ ఇప్పటివరకూ గనులు, ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు.
* విద్యుత్, బొగ్గు, పునర్వినియోగిత ఇంధనశక్తి శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న పీయూష్గోయల్కు అదనంగా గనుల శాఖ ఇచ్చారు. రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న మనోజ్సిన్హాకు సమాచారశాఖను స్వతంత్ర సహాయమంత్రి హోదాలో అప్పగించారు.
* జౌళిశాఖ స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న సంతోష్కుమార్ గాంగ్వర్ను ఆర్థికశాఖకు బదిలీ చేశారు. ఆర్థికశాఖలో సహాయమంత్రిగా ఉన్న జయంత్సిన్హాను పౌరవిమానయానశాఖకు మార్చారు. ఇప్పటివరకూ ఆ శాఖలో ఉన్న మహేశ్శర్మను సంస్కృతి, పర్యాటక శాఖకు మార్చారు. అర్జున్రామ్మేఘ్వాల్ను ఆర్థికశాఖలో రెండో సహాయమంత్రిగా చేర్చారు. ఇక కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో.. విజయ్గోయల్కు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖను ఇంతకుముందు సర్బానంద సోనేవాల్ నిర్వహించేవారు. ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా వెళ్లిన విషయం తెలిసిందే.
* పర్యాటక శాఖకు జవదేకర్ స్థానంలో అనిల్మాధవ్ దవేను స్వతంత్ర సహాయమంత్రిగా నియమించారు.
* అప్నాదళ్ నేత అనుప్రియాపాటిల్తో పాటు, ఫగన్సింగ్ కులస్తేలకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖలో సహాయమంత్రులుగా చోటు కల్పించారు.
* డాక్టర్ ఎస్.ఆర్.భామ్రేను రక్షణమంత్రి మనోహర్ పారికర్కు సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
* కేబినెట్ మంత్రుల్లో గడ్కరీ, ఉమాభారతి, అశోక్గజపతిరాజు, పారికర్, సురేష్ప్రభు, రాంవిలాస్పాశ్వాన్, కల్రాజ్మిశ్రా, మేనకా సంజయ్గాంధీ, నజ్మాహెప్తుల్లా, జె.పి.నడ్డా, అనంత్ గీతే, హర్సిమ్రత్కౌర్, జ్యుయల్ ఓరమ్, రాధామోహన్సింగ్, తావర్చంద్ గెహ్లాట్ తదితరుల శాఖల్లో మార్పు లేదు.
వేటు వీరిపైనే…
ప్రధాని మోడీ ఐదుగురు సహాయ మంత్రులపై వేటు వేశారు. సన్వర్లాల్ జాట్ (జలవనరుల శాఖ), మోహన్భాయ్ కుందరియా (వ్యవసాయశాఖ), నిహాల్చంద్ (పంచాయతీరాజ్), మన్సుఖ్భాయ్ ధాంజీభాయ్ (గిరిజన వ్యవహారాలు), ప్రొఫెసర్ రామ్శంకర్ కతేరియా (మానవ వనరుల అభివృద్ధి)లపై వేటు వేశారు. వారి రాజీనామా లేఖలను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మంగళవారం నాడే ఆమోదించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.