కిమ్ జాంగ్ కఠిన నిర్ణయం తీసుకుంటారా..?
ఉత్తర కొరియా- అమెరికా, దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. దక్షిణ కొరియా దేశాధ్యక్షుడి అధికారిక భవనం బ్లూ హౌస్ను నేలమట్టం చేయడానికి ఏర్పాట్లు చేయాలంటూ ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు సైన్యానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే కిమ్ జాంగ్ బాంబు పేల్చారు. దేశం కోసం, అధ్యక్షుడిపై ఉన్న ప్రేమను, భక్తిని నిరూపించడం కోసం ప్రజలు 70 రోజుల పాటు కష్టపడాలని సూచించారు. ఈ డెబ్భై రోజులపాటు బద్దకాన్ని దూరంగా పెట్టాలన్నారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. దేశానికి అవసరమయిన ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రజలు అందరూ చాలా కష్టపడాలన్నారు. శత్రుదేశాలు తనను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కిమ్ జాంగ్ భావిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఉత్పత్తులను భారీగా తయారుచేసుకోవడానికి పిలుపునివ్వడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న అమెరికా-దక్షిణ కొరియా సైన్యాల సైనిక కవాతు ఈ ఏప్రిల్తో ముగుస్తుంది. దేశ ప్రజలకు అవసరమయిన ఉత్పత్తులు రెడీ చేసుకున్న తర్వాత కిమ్ జాంగ్ కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని ఉత్తరకొరియా అధికారులు చర్చించుకుంటున్నారని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.